నేషనల్ క్లే డే సందర్భంగా పెనుగొలనులో కుమ్మరి కళాకారులకు ఘన సన్మానం
ఎన్టీఆర్ జిల్లా, గంపలగూడెం మండలం, పెనుగొలను: నేషనల్ క్లే డే సందర్భంగా శనివారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో పెనుగొలనులో ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కుమ్మరి కళాకారులు కోరంపల్లి రామకోటయ్య (70), వడ్డెరపు వెంకటేశ్వర్లు (66)లను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
ఈ సందర్భంగా సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ మట్టితో తయారు చేసిన కుండలు, పాత్రలు, దీపాలు, పూజా సామగ్రి వినియోగం ఆరోగ్యానికి, పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన మట్టి కళను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
ప్రగతి కాన్వెంట్ కరస్పాండెంట్ వెదురు వెంకటరెడ్డి మాట్లాడుతూ కుమ్మరి కళను, ఆ వృత్తిపై ఆధారపడిన కుటుంబాలను ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదుకోవాలని కోరారు. ఆర్థిక సహాయం, ప్రోత్సాహక పథకాల ద్వారా ఈ సంప్రదాయ వృత్తిని పరిరక్షించి అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రస్తుతం కుమ్మరి కళాకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ కన్వీనర్ రంగు సత్యనారాయణ, సాయిబాబా సేవా కమిటీ సభ్యులు రాళ్లచర్ల జగన్నాథం, పాశం వెంకటేశ్వర్లు, ఇలాసాగరపు మోహన్రావు, డాక్టర్ గోపి తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.