నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అల్బెండజోల్ మాత్రల పంపిణీ
చిన్నారుల్లో నులిపురుగుల సమస్యను నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి అల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని వైద్య, ఆరోగ్య శాఖ ప్రారంభిస్తోంది.
హైదరాబాద్లోని రాజ్భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అర్హులైన చిన్నారులకు అల్బెండజోల్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అలాగే నులిపురుగుల నివారణ, వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వంటి అంశాలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా చిన్నారుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు నులిపురుగుల వల్ల కలిగే పోషకాహార లోపం, రక్తహీనత వంటి సమస్యలను తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యంగా అధికారులు తెలిపారు.