నీట్ పరీక్షను రద్దు చేయాలి – విద్యార్థులపై పోలీసుల దాడులను వెంటనే నిలిపివేయాలి
నీట్ పరీక్షను రద్దు చేయాలి – విద్యార్థులపై పోలీసుల దాడులను వెంటనే నిలిపివేయాలి
- కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి
- మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ. 1 కోటి పరిహారం అందించాలి
- ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం డిమాండ్
లక్సెట్టిపేట :నీట్ పరీక్ష విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని, తమ హక్కుల కోసం న్యూఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల దాడులను వెంటనే నిలిపివేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షుడు కొల్లూరి రవికుమార్ డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలో జరుగుతున్న అవకతవకలు, అసమానతలు, విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడికి నిరసనగా ఆందోళన చేపడుతున్న విద్యార్థులపై టియర్ గ్యాస్ ప్రయోగించడం, లాఠీచార్జ్ చేయడం, బలవంతంగా అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం వారిపై బలప్రయోగానికి పాల్పడటం అత్యంత విచారకరమని, శాంతియుతంగా నిరసన తెలిపే రాజ్యాంగబద్ధ హక్కును గౌరవిస్తూ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు.
నీట్ పరీక్షల నిర్వహణలో నెలకొన్న తీవ్ర పరిస్థితులకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కొల్లూరి రవికుమార్ డిమాండ్ చేశారు. నీట్ స్థానంలో విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించేలా కొత్త ప్రవేశ విధానాన్ని రూపొందించాలని, అలాగే నీట్ ఒత్తిడి తదితర పరిణామాల నేపథ్యంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి విద్యార్థి కుటుంబానికి రూ. 1 కోటి చొప్పున పరిహారం అందించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. దేశ భవిష్యత్తైన విద్యార్థుల గొంతును అణచివేయకుండా విద్యా వ్యవస్థను విద్యార్థులకు అనుకూలంగా మార్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం గౌరవ అధ్యక్షులు ఆవునూరు వెంకటేష్, విద్యార్థులు అభిలాష్, అన్వేష్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు