నిబంధనల ప్రకారమే వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ
రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలి
పారదర్శకంగా, వేగంగా ధాన్యం తరలింపు: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్:
ప్రభుత్వం చేపట్టిన కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు, నిల్వ, రవాణా ప్రక్రియలను నిబంధనల ప్రకారం సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన చెన్నూర్ మండలంలోని ఒతుకులపల్లి, ఆస్నాద్, సోమనపల్లి గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు, చెన్నూర్ మండల కేంద్రంలోని గోదామును మండల తహసిల్దార్ మల్లికార్జున్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లిస్తోందని, నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని రైతుల వద్ద నుండి ఎలాంటి అవాంతరాలు లేకుండా పారదర్శకంగా, వేగంగా కొనుగోలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
ఈ క్రమంలో కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఇబ్బంది కలగకుండా త్రాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించడంతో పాటు గోనె సంచులు, టార్పాలిన్ కవర్లు, తూకం యంత్రాలు, ప్యాడీ క్లీనర్లను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు. కొనుగోలు కేంద్రాల నుండి సేకరించిన ధాన్యాన్ని వెంటనే గోదాములలో నిల్వ చేయాలని తెలిపారు. ధాన్యం నిల్వ, తరలింపు ప్రక్రియలో ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, రైతులకు ఎక్కడా ఎలాంటి నష్టం వాటిల్లకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు మరియు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి అనుగుణంగా ధాన్యం ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, నిర్దేశిత లక్ష్యాలను త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు పరస్పర సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ పిలుపునిచ్చారు. కొనుగోలు ప్రక్రియను విజయవంతం చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ మండల తహసిల్దార్ మల్లికార్జున్తో పాటు సంబంధిత శాఖల అధికారులు, కేంద్రాల నిర్వాహకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు