నిరంతరం పారుతున్న అసిఫ్ నౌహర్ కాల్వ
నిరంతరం పారుతున్న అసిఫ్ నౌహర్ కాల్వ
నిలువునా మునుగుతున్న రైతన్న
* కాలువ నీటిని నిలిపివేయాలని కక్కిరేణి, రంగమ్మగూడెం రైతుల వినతి
గత నాలుగేళ్లుగా అసిఫ్ నౌహర్ కాల్వ నీరు నిరంతరాయంగా వస్తుండటంతో తమ పొలాలు చిత్తడిగా మారి, సాగుకు వీలు లేకుండా పోతున్నాయని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి మరియు రంగమ్మగూడెం గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం వారు చిట్యాల లో ఉన్న ఇరిగేషన్ డివిజనల్ ఇంజనీర్ లో గోడును వెళ్లబోసుకుంటూ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అసిఫ్ నౌహర్ రావడం వల్ల భూమి ఎప్పుడూ తేమగా ఉండి, దుక్కులు దున్నడానికి వీలు లేకుండా పోతోంది అని వాపోయారు. పొలాలు బురదమయంగా మారడంతో వరి కోత మిషన్లు, ట్రాక్టర్లు దిగబడిపోతున్నాయి అని , దీనివల్ల పండిన పంటను కోసుకోలేక, కొత్త పంట వేయలేక రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. సాగుకు వీలు పడకపోవడంతో రైతులు పొలాలను వదిలేయాల్సి వస్తోంది అని, ఫలితంగా పంట భూముల్లో జమ్మి చెట్లు మొలిచి అడవిలా మారుతున్నాయి అని అన్నారు. అధికారులు స్పందించి వెంటనే కాల్వను పరిశీలించాలని , పొలాలు ఆరడం కోసం కనీసం రెండు నెలల పాటు కాల్వ నీటిని నిలిపివేయాలని, తద్వారా భూమి సాగుకు అనుకూలంగా మారుతుందని వారు తెలిపారు. జూన్ 25 తర్వాత హెడ్ లెవల్ నుండి కాల్వ చివరి ఆయకట్టు రైతుల వరకు అందరూ ఒకేసారి నాట్లు వేసుకునే విధంగా స్పష్టమైన "టైం టేబుల్" ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గతంలో అధికారులుకు ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చామని, వారు స్పందించి ఇచ్చిన హామీలు అమలు కాలేదని, ఈసారైనా తమ సమస్యను పరిష్కరించి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.