నకిలీ గుర్తింపు కార్డులతో 25 పెళ్లిళ్లు.. బీజేపీ ఎమ్మెల్యే అల్లుడు అరెస్ట్!
నకిలీ గుర్తింపు కార్డులతో 25 పెళ్లిళ్లు.. బీజేపీ ఎమ్మెల్యే అల్లుడు అరెస్ట్!
పెళ్లిళ్ల పేరుతో యువతుల కుటుంబాలకు భారీ మోసం.. తండ్రీకొడుకులపై కేసు నమోదు
లక్నో: ఉత్తరప్రదేశ్లో సంచలనం సృష్టించిన మోసపూరిత వివాహాల వ్యవహారంలో బీజేపీ ఎమ్మెల్యే అల్లుడు ప్రకార్ త్రివేది అరెస్టయ్యాడు. నకిలీ పేర్లు, తప్పుడు గుర్తింపు కార్డులను ఉపయోగించి మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో సుమారు 25 మంది యువతులను వివాహం చేసుకున్నట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. పెళ్లిళ్ల అనంతరం ఆయా కుటుంబాల నుంచి నగదు, బంగారు ఆభరణాలు తీసుకుని పరారయ్యేవాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.
సేవతా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీ కుమార్తె ప్రజ్ఞను 2024లో ప్రకార్ త్రివేదికి ఇచ్చి వివాహం చేశారు. పెళ్లికి ముందు ప్రకార్ తండ్రి అనుజ్ త్రివేది తమకు ముంబైలో భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని, కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయని ఎమ్మెల్యే కుటుంబాన్ని నమ్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కుటుంబానికి స్థానికంగా మంచి పేరు ఉందని చెప్పడంతో ఈ వివాహానికి ఎమ్మెల్యే కుటుంబం అంగీకరించింది.
అయితే వివాహం జరిగిన రెండేళ్లకు ప్రకార్ త్రివేది అసలు వ్యవహారం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. నకిలీ గుర్తింపు కార్డులు, వేర్వేరు పేర్లతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో పలువురు యువతులను వివాహం చేసుకున్నట్లు ఆరోపణలు బయటపడ్డాయి. పెళ్లి తర్వాత భార్య కుటుంబాలను మోసం చేసి నగదు, నగలు తీసుకుని కనిపించకుండా పోవడం అతడి పద్ధతిగా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆగస్టు 6న కుమార్తెతో కలిసి వీడియో విడుదల చేసి, ఆమెను తిరిగి ఇంటికి తీసుకొచ్చినట్లు తెలిపారు. మోసపూరిత కుటుంబంతో ఇకపై ఎలాంటి సంబంధాలు కొనసాగించబోమని స్పష్టం చేశారు. అనంతరం రేవుసా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు లభించడంతో ప్రకార్ త్రివేది, అతడి తండ్రి అనుజ్ త్రివేదిని పోలీసులు శనివారం అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై ఎమ్మెల్యే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబాన్ని మోసం చేసిన అనుజ్ త్రివేదిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తన కుమార్తె జీవితాన్ని నాశనం చేసిన ప్రకార్ త్రివేదికి చట్టప్రకారం అత్యంత కఠినమైన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కేసులో నిందితుడు నిజంగా ఎన్ని వివాహాలు చేసుకున్నాడు? ఎంతమందిని మోసం చేశాడు? ఎంత మొత్తంలో నగదు, బంగారం స్వాహా చేశాడు? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.