నకిలీ పత్రాలతో రూ.50 కోట్ల భూమి కాజేయాలన్న కుట్ర భగ్నం
సబ్రిజిస్ట్రార్ అప్రమత్తతతో భారీ మోసం వెలుగులోకి.. ఒకరు అరెస్ట్.. ఇద్దరు పరారీ
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నకిలీ పత్రాలతో సుమారు రూ.50 కోట్ల విలువైన భూమిని రిజిస్ట్రేషన్ చేయించేందుకు జరిగిన భారీ మోసయత్నం సబ్రిజిస్ట్రార్ అప్రమత్తతతో భగ్నమైంది. తప్పుడు ధ్రువపత్రాలు, నకిలీ పవర్ ఆఫ్ అటార్నీ ఆధారంగా విలువైన కమర్షియల్ స్థలాన్ని కాజేయాలని ప్రయత్నించిన ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకరిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, ఈ నెల 10న బాల సరస్వతమ్మ, వెంగళ ఉమానరేష్, బాల గణేష్లు బండమీదకమ్మపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 303/1లో ఉన్న కమర్షియల్ స్థలానికి సంబంధించిన విక్రయ పత్రాలు, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీతో మదనపల్లె సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకున్నారు. పత్రాలను పరిశీలించిన సబ్రిజిస్ట్రార్కు అనుమానం రావడంతో రికార్డులను క్షుణ్నంగా తనిఖీ చేశారు.
ఆన్లైన్ రికార్డులు, మీసేవ పోర్టల్లో పరిశీలించగా వారు సమర్పించిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ నకిలీదిగా తేలింది. ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ ద్వారా ఆ భూమి అసలు యజమానులు వేరే వ్యక్తులేనని నిర్ధారణ కావడంతో రిజిస్ట్రేషన్ను వెంటనే నిలిపివేశారు. నిందితులకు ఆ భూమిపై ఎలాంటి చట్టబద్ధ హక్కు లేదని అధికారులు గుర్తించారు.
రిజిస్ట్రేషన్ను తిరస్కరించడంతో నిందితులు సబ్రిజిస్ట్రార్పై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పత్రాలు నకిలీవేనని తెలిసినా రిజిస్ట్రేషన్ చేయాలని బెదిరించడంతో పాటు ఉద్యోగం పోగొడతామని, కిడ్నాప్ చేస్తామని హెచ్చరించినట్లు ఆరోపించారు. అంతేకాకుండా సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ జిల్లా అధికారులకు వరుస ఫిర్యాదులు పంపి మానసిక వేధింపులకు గురిచేసినట్లు వెల్లడైంది.
ఫిర్యాదు ఆధారంగా మదనపల్లె వన్టౌన్ పోలీసులు సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వెంగళ ఉమానరేష్ను అరెస్ట్ చేయగా, బాల సరస్వతమ్మ, బాల గణేష్ కోసం గాలింపు చేపట్టారు. నకిలీ పత్రాల తయారీ వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనతో నకిలీ పత్రాల ఆధారంగా విలువైన ఆస్తులను కాజేయాలని ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.