నకిలీ సర్టిఫికెట్ల రాకెట్: ఐదుగురు అరెస్ట్
నకిలీ సర్టిఫికెట్ల రాకెట్: ఐదుగురు అరెస్ట్
చిత్తూరు: పులిచెర్ల మండలంలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి కోర్టుల్లో షూరిటీలుగా వినియోగిస్తున్న ముఠాను పోలీసులు బహిరంగం చేశారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పులిచెర్ల ఎంపీడీవో రాజశేఖర్ బాబు ఫిర్యాదుపై ఈ నెల 18న కేసు నమోదు చేయగా, డీఎస్పీ సాయినాథ్ పర్యవేక్షణలో కల్లూరు సీఐ ఎం. జయరామయ్య, ఎస్సై వెంకటేశ్వర్లు దర్యాప్తు నిర్వహించారు. విచారణలో నిందితులు ఎం.పీ.డీ.వో కార్యాలయం, చిన్నగొట్టిగల్లు పంచాయతీ కార్యదర్శి పేర్లతో నకిలీ సీలు తయారు చేసి వాటితో నకిలీ సర్టిఫికెట్లు సిద్ధం చేస్తున్నట్టు బయటపడ్డాయి. ఈ పత్రాలను ఉపయోగించి తిరుపతి, పాకాల, పీలేరు, పుంగనూరు, చిత్తూరు కోర్టుల్లో వివిధ కేసుల్లో సుమారు 200 మందికి పైగా షూరిటీలను సమకూర్చినట్టు పోలీసులు తెలిపారు.
అరెస్ట్ చేసిన నిందితులు: డి. ఆంజనేయులు రామిరెడ్డి గారిపల్లి, పులిచెర్ల మండలం, సి. రవి రామిరెడ్డి గారిపల్లి, పులిచెర్ల మండలం, నీల వెంకటరమణ – జంగావాండ్లపల్లి, చిన్నగొట్టిగల్లు మండలం, పి. బ్రహ్మయ్య – గాంధీపురం, తిరుపతి, బాలసుబ్రమణ్యం – యాదవ కాలనీ, తిరుపతి. అరెస్టు చేసిన వారిని కోర్టులో హాజరుపరచి రిమాండ్కు పంపారు. కల్లూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్స్ ఆనందు, నాగరాజు, కానిస్టేబుల్స్ బావాజీ, మహేష్, వాసు, శ్రీనివాసులు కృషి చేసినందుకు డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.