నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండండి: రైతులకు చాట్రాయి ఏవో బి శివశంకర్ హెచ్చరిక
వానాకాలం సాగు పనులు ప్రారంభమైన నేపథ్యంలో కొందరు అక్రమ వ్యాపారులు నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు విక్రయించి రైతులను మోసం చేసే అవకాశం ఉందని ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్ హెచ్చరించారు రైతులు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన విత్తనాలు నకిలీవైతే మొలక శాతం తగ్గిపోవడం, దిగుబడి పడిపోవడం వల్ల తీవ్ర నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు
రైతులు తప్పనిసరిగా వ్యవసాయ శాఖ అనుమతి పొందిన లైసెన్స్ కలిగిన దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు బిల్లు తీసుకుని భద్రపరచుకోవాలని, భవిష్యత్తులో సమస్యలు తలెత్తితే ఫిర్యాదు చేయడానికి అది ఆధారంగా ఉపయోగపడుతుందని తెలియజేశారు
విత్తన ప్యాకెట్పై కంపెనీ పేరు, బ్యాచ్ నెంబర్, తయారీ తేదీ, గడువు తేదీ, మొలక శాతం వంటి వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకు విక్రయించే విత్తనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వాటిలో నకిలీ విత్తనాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించారు
ప్యాకింగ్ లేని విత్తనాలు, కంపెనీ గుర్తింపు లేని విత్తనాలు, రహస్యంగా విక్రయించే విత్తనాలను కొనుగోలు చేయవద్దని సూచించారు. అలాగే విత్తనాల సంచులను తెరిచిన తర్వాత వాటి ట్యాగ్లు, లేబుళ్లు, ఖాళీ ప్యాకెట్లను కొంతకాలం భద్రపరచుకోవాలని తెలిపారు
ఏదైనా అనుమానం కలిగితే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు, నకిలీ విత్తనాల వల్ల రైతులు ఒక సీజన్ మొత్తాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
"రైతు జాగ్రత్తే పంటకు భరోసా... నాణ్యమైన విత్తనం అధిక దిగుబడికి మొదటి అడుగు" అని పేర్కొన్నారు