నందిగామలో వినియోగదారుల హక్కులపై న్యాయ విజ్ఞాన సదస్సు
నందిగామ: వినియోగదారులు తమ హక్కులను తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి మల్యాల సాహితి సూచించారు. వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నందిగామ గ్రామపంచాయతీలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్యాల సాహితి మాట్లాడుతూ, ప్రతి వ్యక్తి వినియోగదారుడేనని, వస్తువులు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. నాణ్యమైన వస్తువులనే కొనుగోలు చేయడం, తప్పనిసరిగా రసీదు తీసుకోవడం, గడువు ముగిసిన ఉత్పత్తులను కొనకూడదని సూచించారు.
ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వెబ్సైట్లను ఉపయోగించరాదని హెచ్చరించారు. ఒకవేళ వినియోగదారులు మోసపోతే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఉన్న వినియోగదారుల ఫోరంలను ఆశ్రయించి నష్టపరిహారం పొందవచ్చని వివరించారు.
కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్వ వేణుగోపాల్ రావు, సిఐ ప్రసాద్, గ్రామ సర్పంచ్ కొమ్ము కృష్ణ, డిప్యూటీ సర్పంచ్ వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై అవగాహన పొందారు.