నూజివీడు నియోజకవర్గంలో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా ఆరోపణలు
నూజివీడు నియోజకవర్గంలో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా ఆరోపణలు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పిడిఎస్) బియ్యం అక్రమ రవాణా యదేచ్ఛగా సాగుతోందన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో ఈ అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికంగా చర్చ కొనసాగుతోంది.
కొంతమంది అక్రమ రవాణాదారులు పలు రైస్ మిల్లులను లీజుకు తీసుకుని, అక్కడ పిడిఎస్ బియ్యాన్ని పాలిష్ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. కొన్ని నెలల క్రితం మిల్లుల్లో పిడిఎస్ బియ్యం పట్టుబడిన ఘటనలు వెలుగులోకి రావడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది.
పట్టుబడుతున్న పరిమాణం తక్కువగా ఉన్నప్పటికీ, వాస్తవానికి భారీ స్థాయిలో అక్రమ రవాణా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా చాట్రాయి మండలం పరిధిలోని చిన్నంపేట, సి.గుడిపాడు, మర్లపాలెం గ్రామాల్లో స్ధావరాలు ఏర్పాటు చేసుకుని ఈ దందా కొనసాగుతోందని చెబుతున్నారు.
చిన్నంపేట గ్రామంలోని ఒక పెట్రోలు బంకు వద్ద నెంబర్ లేని వాహనాలు తరచూ నిలిపి ఉంచి పిడిఎస్ బియ్యాన్ని తరలిస్తున్న ఘటనలు గమనించబడ్డాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై పోలీసులు, ఫౌరసరఫరాల శాఖ అధికారులు సమన్వయంతో కఠిన చర్యలు తీసుకుంటే అక్రమ రవాణాను అరికట్టవచ్చని ప్రజలు కోరుతున్నారు.