న్యాయమూర్తుల నియామకాల్లో జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు
న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టు కొలీజియంలు తీసుకునే నిర్ణయాల్లో న్యాయపరంగా జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేవలం సీనియారిటీ ఉన్నంత మాత్రాన న్యాయమూర్తి పదోన్నతి పొందే హక్కు ఎవరికీ ఉండదని తేల్చిచెప్పింది.
తనకంటే జూనియర్లను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించడాన్ని సవాలు చేస్తూ హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఓ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఈ కేసును సోమవారం విచారించిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కొలీజియం తీసుకున్న నిర్ణయాలను తిరిగి పరిశీలించడం ద్వారా కొత్త వివాదాలకు తాము తెరతీయదలచుకోలేదని పేర్కొంది. న్యాయమూర్తుల ఎంపిక, పదోన్నతుల విషయంలో కొలీజియంకు ఉన్న అధికారాలను గౌరవించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
అలాగే పిటిషనర్కు ఇంకా పదేళ్ల సర్వీసు మిగిలి ఉన్నందున ఓపికగా వేచి ఉండాలని, భవిష్యత్తులో పదోన్నతి అవకాశం లభించే అవకాశముందని సూచించింది. ఈ సందర్భంగా సీనియారిటీ ఒక్కటే పదోన్నతికి ప్రమాణం కాదని, ఇతర అంశాలు కూడా పరిగణనలోకి తీసుకుంటారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.