న్యూఢిల్లీ: బార్ కౌన్సిల్లో రూ.150 కోట్ల కుంభకోణం ఆరోపణలు..
న్యూఢిల్లీ: బార్ కౌన్సిల్లో రూ.150 కోట్ల కుంభకోణం ఆరోపణలు.. చైర్మన్ మనన్ మిశ్రా రాజీనామాకు డిమాండ్
బిసిఐ వైస్ చైర్మన్ వైఆర్ సదాశివ రెడ్డి సంచలన ఆరోపణలు
15 రోజుల్లో పదవి నుంచి తప్పుకోవాలని అల్టిమేటం
న్యూఢిల్లీ: బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బిసిఐ) చైర్మన్ మనన్ మిశ్రాపై రాజీనామా ఒత్తిడి పెరుగుతోంది. నల్సార్ విశ్వవిద్యాలయం వివాదంలో జోక్యం చేసుకున్నారనే విమర్శల నేపథ్యంలో తాజాగా బిసిఐ వైస్ చైర్మన్, సీనియర్ న్యాయవాది వైఆర్ సదాశివ రెడ్డి కూడా ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మనన్ మిశ్రాపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిన సదాశివ రెడ్డి.. బిసిఐ నిధుల్లో రూ.150 కోట్లను పక్కదారి పట్టించారని ఆరోపించారు. బిసిఐ, దాని అనుబంధ సంస్థల్లో నిబంధనలను పట్టించుకోకుండా కుటుంబ సభ్యులు, తనకు అనుకూలమైన వ్యక్తులను కీలక స్థానాల్లో నియమించారని విమర్శించారు.
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ పట్టభద్రుల న్యాయవాదుల నమోదుపై నిషేధం విధించడం ద్వారా బిసిఐ ప్రతిష్టకు నష్టం కలిగిందని ఆయన పేర్కొన్నారు. బిసిఐని సంప్రదించకుండానే వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేశారని ఆరోపించారు.
సుదీర్ఘకాలంగా బిసిఐలో కొనసాగుతున్న మనన్ మిశ్రా వ్యవస్థను దెబ్బతీశారని విమర్శిస్తూ.. 15 రోజుల్లోగా చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని అల్టిమేటం జారీ చేశారు. బిసిఐ, బిసిఐ ట్రస్ట్ పెర్ల్-ఫస్ట్ ఖాతాలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
లా కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచి బిసిఐ లేదా అనుబంధ సంస్థలు విరాళాలు స్వీకరించే విధానాన్ని వెంటనే నిలిపివేయాలని కోరారు. బిసిఐ ఏ వ్యక్తిగత సంస్థ కాదని, పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడిన శాసనబద్ధ సంస్థ అని గుర్తు చేశారు.
నల్సార్ వివాదం నేపథ్యం
నల్సార్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను ఆహ్వానించడంపై కొందరు విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన బిసిఐ.. 2026 బ్యాచ్ నల్సార్ న్యాయ విద్యార్థుల న్యాయవాదుల నమోదుపై తాత్కాలిక నిషేధం విధించింది.
విద్యార్థుల చర్యను క్రమశిక్షణా రాహిత్యంగా పేర్కొంటూ రాష్ట్ర బార్ కౌన్సిల్స్ ఎవరినీ నమోదు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు రావడంతో 24 గంటల్లోనే బిసిఐ ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది.