ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం
యజమానుల మృతితో దీన స్థితిలో కుటుంబాలు
ప్రభుత్వం, ఆయా పార్టీలు ఆదుకోవాలని వినతి
కామవరపుకోట: ఈనెల రెండవ తేదీన హైదరాబాద్ సమీపంలో చౌటుప్పల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో డ్రైవింగ్ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న ఆ ముగ్గురి పాలిట కంటైనర్ రూపంలో మృత్యువుగా మారింది. జీవనోపాధి కోసం వందల కిలోమీటర్ల ప్రయాణం చేయటానికి ముందుకు సాగుతున్న వారి వాహనం టైర్ పంచర్ వేయటానికి ఆపడంతో పల్లా నవీను, సాధనాల స్వామి సంఘటన స్థలంలోనే విగత జీవులుగా మారారు. కొన ఊపిరితో ఉన్న రాచప్రోలు కన్నయ్య గురువారం చికిత్స పొందుతూ మృతి చేశారు.
వివరాలు: కామవరపుకోట మండలం జలపవారిగూడెం గ్రామానికి చెందిన నవీన్, స్వామి, కన్నయ్య తమ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం డ్రైవింగ్ వృత్తి చేపట్టారు. రాత్రనకా పగలనకా పనిచేసి పొట్ట నింపుకోవటంతో పాటు వారి కుటుంబ జీవనాధారంగా ముందుకు సాగుతున్నారు. ఇదే తరుణంలో కామవరపుకోట నుండి కొబ్బరి బొండాల లోడుతో ఈనెల రెండవ తేదీ రాత్రి హైదరాబాద్ పయనమయ్యారు. చౌటుప్పల్ సమీపంలోకి వెళ్లేసరికి టైర్ పంచర్ కావడంతో రోడ్డు పక్కన మార్జిన్లో తమ వాహనాలను ఆపి పంచర్ వేసుకుంటున్నారు.
ఇదే తరుణంలో మృత్యు రూపంలో కంటైనర్ వచ్చి ఢీకొనటంతో నాలుగు వ్యాన్లు సమీప ప్రాంతంలో చెల్లాచెదరయ్యాయి. కొబ్బరి బొండాలతో పాటు డ్రైవర్లు అయిన నవీన్, స్వామి, కన్నయ్య రక్తపు మడుగులో తడిసి ముద్దయ్యారు. పల్లా నవీన్ కు భార్య రెండు నెలల కుమారుడు ఉండగా, సాధనాల స్వామి భార్య నిండు గర్భిణిగా ఉంది. కన్నయ్యకు భార్య పెళ్లికి వచ్చిన కుమార్తె కుమారుడు ఉన్నారు. వీరంతా ఎస్సీ కులముకు చెందిన వారితో పాటు దిగువ తరగతికి చెందిన కుటుంబాల వారు కావటం కుటుంబాలకు ఆధారంగా ఉన్న పెద్దదిక్కుని కోల్పోవడంతో దీనస్థితిలోకి వెళ్లారు.
ప్రస్తుతం వారి పరిస్థితులు హృదయ విదారకంగా మారాయి. రెండు నెలల బాబుకు, నిండు గర్భిణీ గా ఉండి పుట్టబోయే పసికందు కు ఏమని చెప్పాలో తెలియక మాతృమూర్తులు తల్లడిల్లుతున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనదారులు ఎటువంటి సహాయం అందజేయలేదని, ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే నగదును కుటుంబాలకు అందజేస్తామని చేతులు దులుపుకున్నారని బంధువులు తెలుపుతున్నారు. ఆ ఇన్సూరెన్స్ డబ్బులు ఏనాటికి వస్తాయో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.
ఇటువంటి తరుణంలో ఆసరా కోల్పోయిన నవీన్, స్వామి, కన్నయ్య కుటుంబాలను ప్రభుత్వం తరపున ఆదుకోవాలని కోరుతున్నారు. నవీన్, స్వామి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కాగా, కన్నయ్య తెలుగుదేశం కార్యకర్త అని, నిలువెత్తు అభిమానంతో పార్టీల జెండాలు మోసిన కరడు కట్టిన అభిమానుల కుటుంబాలను ఆయా పార్టీలు వారు సహృదయంతో ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.