ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా జరగాలి – సిపిఐ నేతల డిమాండ్
ఏలూరు: రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నాయకులు డిమాండ్ చేశారు.
సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో ఆర్.ఆర్.పేటలోని స్ఫూర్తి భవన్లో ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డేగ ప్రభాకర్, జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు.
డేగ ప్రభాకర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పలు రాష్ట్రాల్లో వివాదాలు, విమర్శలు వ్యక్తమయ్యాయని అన్నారు. బీహార్లో లక్షలాది ఓట్లు తొలగించబడ్డాయనే ఆరోపణలు వచ్చాయని, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో బ్రతికే ఉన్న వ్యక్తులను మరణించినట్లుగా నమోదు చేసి ఓటర్ల జాబితా నుంచి తొలగించిన ఘటనలు వెలుగుచూశాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో చేపట్టనున్న సవరణ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణ విషయంలో భిన్న విధానాలు అనుసరిస్తోందనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని అన్నారు. గతంలో చోటుచేసుకున్న లోపాలు పునరావృతం కాకుండా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు తమ ఓటు నమోదు వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని, అవసరమైతే సిపిఐ సహాయాన్ని పొందవచ్చని సూచించారు.
ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ అర్హత ఉన్న ఒక్క ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోకుండా ఎన్నికల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఏలూరు ఏరియా పరిధిలో ఓటర్లకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి సిపిఐ కార్యాలయం అందుబాటులో ఉంటుందని తెలిపారు.
సీనియర్ పాత్రికేయుడు బెజవాడ బ్రహ్మయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఓటరు తన పేరు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను రాజకీయ కోణంలో కాకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా చూడాలని సూచించారు.
ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీనివాస డాంగ్, ఆటోనగర్ అధ్యక్షుడు అరుణ తార నాగేశ్వరరావు, ప్రజానాట్యమండలి నాయకుడు బళ్ల కనకదుర్గారావు, సిపిఐ నాయకులు మావూరి విజయ, గొర్లి స్వాతి, కొల్లూరి సుధారాణి, ఉప్పులూరి లక్ష్మి, జ్యోతి, పూజ్య లక్ష్మీ అరుణ, తాళ్లూరి సురేఖ తదితరులు పాల్గొన్నారు.