ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్ వి. రాములు
క్షేత్రస్థాయిలో దరఖాస్తుల వేగవంతమైన పరిష్కారానికి అధికారులకు పిలుపు
జూన్ 25వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న మూడవ విడత ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని జిల్లాలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ వి. రాములు అన్నారు. మంగళవారం ఆయన హాజీపూర్, భీమారం, జైపూర్ మండల తహసిల్దార్ కార్యాలయాలను జిల్లా కలెక్టరేట్ విభాగ సూపరింటెండెంట్ మధుసూదన్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బందితో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం, సాదా బైనామా దరఖాస్తులు, మరియు భూభారతి పెండింగ్ దరఖాస్తుల పరిష్కరణ సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా బూత్ స్థాయి అధికారులు తప్పనిసరిగా ప్రతి ఇంటికీ వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, సూపర్వైజర్లు మరియు సహాయ నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారులు ఈ పనుల పురోగతిని పరిశీలించాలని ఆయన తెలిపారు.
ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజల యొక్క ప్రతి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని, ఈ క్రమంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిష్కరణ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో సాదా బైనామా దరఖాస్తులను క్షుణ్ణంగా విచారణ చేసి పరిశీలించిన తర్వాతే ఆమోదించాలని తెలిపారు. కార్యాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని, కార్యాలయానికి వచ్చే ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. ధృవీకరణ పత్రాలను నిబంధనలకు లోబడి, నిర్ణీత గడువులోగా జారీ చేయాలని తెలిపారు. ఈ సమీక్షా కార్యక్రమంలో సంబంధిత అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు