పాడి రైతుల అభివృద్ధే లక్ష్యం
పాడి రైతుల అభివృద్ధే లక్ష్యం – కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు
తిరువూరు మండలం పెద్దవరం MPMACS పాల సంఘాన్ని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు సందర్శించి పాడి రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ డాక్టర్ పారి, జిల్లా ట్రస్ట్ సభ్యుడు పల్నాటి సత్యనారాయణ, సంఘ అధ్యక్షుడు గద్దె వెంకటేశ్వరరావు, క్లస్టర్ మేనేజర్ పి.ప్రసాద్, వెటర్నరీ డీడీ లింగం ప్రసాద్, డాక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ పాడి రైతుల సంక్షేమం, సహకార పాల ఉద్యమ బలోపేతం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధే కృష్ణా మిల్క్ యూనియన్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రైతులకు మెరుగైన పాల ధరలు, బోనస్లు, సమయానికి చెల్లింపులు, పశువైద్య సేవలు, పశుగ్రాస అవగాహన, ఆధునిక పాడి పద్ధతులపై శిక్షణ అందిస్తున్నామని చెప్పారు.
రైతుల కోసం సబ్సిడీపై దాణా, కాల్షియం, మినరల్ మిక్చర్, తక్కువ ఖర్చుతో కృత్రిమ గర్భధారణ సేవలు, పశు బీమా, ఉచిత మొబైల్ వెటర్నరీ సేవలు, వైద్య శిబిరాలు, రైతు మరణించినప్పుడు ఆర్థిక సాయం వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. రైతు బలపడితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
అనంతరం పాడి పశువుల కృత్రిమ గర్భధారణ కోసం PD గన్, చూడు నిర్ధారణ కోసం నూతన CBT విధానాన్ని చైర్మన్ ప్రారంభించారు. రైతులు యూనియన్ అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, పాల ధరల పెంపు, బోనస్లు, సమయానికి చెల్లింపులు తమకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, సూపర్వైజర్ బి. నరసింహారావు, పాడి రైతులు పాల్గొన్నారు.