పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం: కాబూల్ ఆసుపత్రిపై వైమానిక దాడి – 400 మంది మృతి, 200 మందికి పైగా గాయాలు
NTODAYNEWS:- అంతర్జాతీయం
ఆఫ్ఘానిస్థాన్ మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. తాజా పరిణామాల్లో భాగంగా కాబూల్లోని ఒక ఆసుపత్రిపై జరిగిన వైమానిక దాడిలో కనీసం 400 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడినట్లు సమాచారం.
రాజధాని కాబూల్ లో డ్రగ్స్కు బానిసైన వారికి చికిత్స అందించే ఆసుపత్రిపై సోమవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఈ దాడి జరిగినట్లు ఆఫ్ఘన్ అధికార వర్గాలు తెలిపాయి. సుమారు 2000 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆసుపత్రి పూర్తిగా ధ్వంసమైందని పేర్కొన్నారు.
హమ్దుల్లా ఫిత్రత్ అనే ఆఫ్ఘన్ ప్రభుత్వ ఉపప్రవక్త ప్రకారం, ఇప్పటివరకు 400 మంది మృతి చెందగా, సుమారు 250 మంది గాయపడ్డారు. ఇంకా శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు రక్షణ సిబ్బంది శ్రమిస్తున్నారు.
అయితే ఈ ఆరోపణలను పాకిస్తాన్ ఖండించింది. తాము చేసిన వైమానిక దాడులు కేవలం సైనిక స్థావరాలపైనే జరిగాయని, పౌర ప్రాంతాలు లేదా ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకోలేదని ఇస్లామాబాద్ స్పష్టం చేసింది.
ఇటీవల రెండు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గత మూడు వారాలుగా సరిహద్దు వద్ద కాల్పులు, వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ కోసం అంతర్జాతీయ స్థాయిలో పిలుపులు వచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి ఒప్పందం కుదరలేదు.
సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ X లో వైరల్ అవుతున్న వీడియోల్లో రక్షణ సిబ్బంది టార్చ్లైట్లు ఉపయోగించి గాయపడిన వారిని శిథిలాల నుంచి బయటకు తీస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆసుపత్రి శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకుని ఉండే అవకాశం ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఇది ఇటీవలి కాలంలో ఈ రెండు దేశాల మధ్య జరిగిన అత్యంత భీకర ఘర్షణల్లో ఒకటిగా భావిస్తున్నారు.