పాముకాటుకు భవన నిర్మాణ కార్మికుడు మృతి
పాముకాటుకు భవన నిర్మాణ కార్మికుడు మృతి
భవన నిర్మాణ పనుల్లో భాగంగా పాముకాటుకు గురై చికిత్స పొందుతూ ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన రామన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మునిపంపుల గ్రామానికి చెందిన ఉండ్రాతి వెంకన్న (33) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గత జులై 31వ తేదీన కొత్తగూడెం గ్రామంలో ఓ ఇంటి నిర్మాణ పనుల వద్ద పని చేస్తుండగా ఆయనను విషపూరిత పాము కాటు వేసింది అని తెలిపారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన వెంకన్నను వెంటనే రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. పరిస్థితి మరింత విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయనను నల్గొండలోని పెరుమాండ్ల ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఆగస్టు 03 మధ్యాహ్నం సుమారు 3:00 గంటల ప్రాంతంలో వెంకన్న మరణించాడని తెలియజేశారు మృతుని భార్య ఉండ్రాతి నవనీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామన్నపేట ఎస్సై సతీష్ కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.