పార్వతీపురం మన్యం జిల్లాలో గజరాజుల సంచారం.. రైతుల్లో ఆందోళన
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల సంచారం స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగా సాలూరు, పార్వతీపురం నియోజకవర్గాల పరిధిలో సంచరిస్తున్న గజరాజులు, సోమవారం రాత్రి సీతానగరం మండలం గుచ్చిమి గ్రామంలో ప్రత్యక్షమయ్యాయి.
గ్రామ పరిసరాల్లోకి వచ్చిన ఏనుగులు రెండు వరి కోత యంత్రాలను ధ్వంసం చేశాయి. ఇటీవల పామాయిల్ తోటలు, వ్యవసాయ మోటార్లను కూడా నాశనం చేసినట్లు రైతులు చెబుతున్నారు.
అటవీ ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లోనూ ఏనుగులు సంచరిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంటలు, వ్యవసాయ పరికరాలకు నష్టం వాటిల్లడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రజలు మరియు రైతుల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు అటవీ శాఖ తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.