పేద మైనార్టీలకు కష్టసుఖాల్లో అండగా ఉంటాం
పేద మైనార్టీలకు కష్టసుఖాల్లో అండగా ఉంటాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
పేద ముస్లిం మైనార్టీలకు వారి కష్టసుఖాల్లో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు మరియు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ధర్మారం, ఎండపల్లి, గొల్లపల్లి, పెగడపల్లి మండలాలకు చెందిన ముస్లిం సోదరులకు మంత్రి తోఫాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ధర్మపురి నియోజకవర్గంలోని 2,050 మంది ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ధర్మపురి పట్టణంలోని మసీదులు, ఈద్గా మరియు ఖాబ్రాస్థాన్ అభివృద్ధి కోసం రూ. 51 లక్షలు కేటాయించినట్లు వివరించారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని ముస్లిం మైనార్టీల అభివృద్ధికి, మసీదుల నిర్మాణం మరియు మరమ్మతులకు అవసరమైన నిధులు అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ మంత్రి ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.