పేదల ఆరోగ్యానికి అండగా సీఎంఆర్ఎఫ్.. రూ.1.73 లక్షల ఎల్ఓసీలు అందజేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్: పేదల ఆరోగ్య అవసరాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) పెద్ద భరోసాగా నిలుస్తోందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు తెలిపారు. గురువారం గొల్లపూడిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఇద్దరు లబ్ధిదారులకు మొత్తం రూ.1,73,630ల విలువైన ఎల్ఓసీలను ఎమ్మెల్యే అందజేశారు.
జి.కొండూరు మండలం వెలగలేరు గ్రామానికి చెందిన పటాపంచల చిరంజీవి నవ్యంత్ కుమార్కు రూ.1,24,138లు, ఇబ్రహీంపట్నం మండలం మూలపాడుకు చెందిన డేరంగుల రాజమ్మకు రూ.49,492లు మంజూరయ్యాయి. దీంతో ఇద్దరు లబ్ధిదారులకు కలిపి రూ.1.73 లక్షలకు పైగా ఆర్థిక సహాయం అందినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేశామని చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలు ఎల్ఓసీల ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు పొందే అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు తమ కార్యాలయాన్ని సంప్రదించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం సహాయనిధి ద్వారా సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
సీఎంఆర్ఎఫ్ సాయంతో చికిత్స పొందే అవకాశం లభించడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎల్ఓసీలు అందుకోవడంతో బాధిత కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.