పచ్చిరొట్ట పైర్లతో భూసారం పెంపు.. రైతులకు చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ కీలక సూచనలు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయిలో పచ్చిరొట్ట పైర్ల సాగు ద్వారా భూసారాన్ని పెంపొందించుకోవాలని రైతులకు చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ సూచించారు. తొలకరిలో వరి మరియు ఇతర పంటలు సాగు చేసే రైతులు పెసలు, అలసంద, జనుము, జీలుగా, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట పైర్లను పూత దశకు ముందే కలియదున్నడం వల్ల భూమిలో సేంద్రీయ కర్బనం పెరిగి, నేల సారం గణనీయంగా మెరుగుపడుతుందని తెలిపారు.
అలాగే అజోస్పైరిల్లం, పాస్పో బ్యాక్టీరియా వంటి జీవన ఎరువులను ఎకరానికి 2 నుంచి 3 కిలోల చొప్పున వినియోగించడం ద్వారా రసాయనిక ఎరువుల అవసరాన్ని తగ్గించుకోవచ్చని చెప్పారు. పశువుల ఎరువు, కంపోస్టు, పంట అవశేషాలను ఎకరానికి నాలుగు టన్నుల మేర వాడటం వల్ల భూమి భౌతిక, రసాయనిక, జీవ లక్షణాలు మెరుగుపడి అధిక దిగుబడులకు దోహదపడుతాయని వివరించారు.
ముఖ్యంగా పొటాష్ లోపం ఉన్న పొలాల్లో పొటాష్ అధికంగా ఉండే వరిగడ్డిని తొక్కించడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. సేంద్రియ ఎరువుల వినియోగం ద్వారా హెక్టారుకు 20 నుంచి 40 కిలోల నత్రజని, 10 నుంచి 15 కిలోల భాస్వరం, 30 నుంచి 40 కిలోల పొటాష్ లభిస్తాయని వెల్లడించారు.
ఈ సందర్భంగా చాట్రాయిలో పచ్చిరొట్ట పైర్లు సాగు చేసిన వరి పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన వ్యవసాయ అధికారి బి. శివశంకర్, రైతులకు భూసార పరిరక్షణ, సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. భూమి ఆరోగ్యమే రైతు సంపదకు పునాది అని, పచ్చిరొట్ట పైర్ల సాగు భవిష్యత్లో అధిక దిగుబడులకు బాటలు వేస్తుందని పేర్కొన్నారు.