పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు..
పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు.. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలతో కట్టుదిట్టమైన చర్యలు!
వైఎస్ఆర్ కడప: జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో, సజావుగా సాగేందుకు పోలీస్ శాఖ అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా ఉన్న పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు.
పరీక్షా కేంద్రాల వద్ద ఆంక్షలు:
మార్చి 16 నుండి ప్రారంభమైన ఈ పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు సెల్ఫోన్లు, స్మార్ట్వాచీలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను లోపలికి తీసుకెళ్లకుండా క్షుణ్ణంగా తనిఖీలు (ఫ్రిస్కింగ్) చేస్తున్నారు. అన్ని కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు చేస్తూ, గుంపులుగా ఎవరూ గుమికూడకుండా చర్యలు తీసుకున్నారు. ఇన్విజిలేటర్లు, సంబంధిత సిబ్బంది తప్ప ఇతరులు ఎవరూ కేంద్రాల పరిసరాల్లో ఉండకుండా పర్యవేక్షిస్తున్నారు.
ముమ్మర పెట్రోలింగ్:
పరీక్షా సమయాల్లో జిరాక్స్ మరియు ప్రింటింగ్ సెంటర్లు మూసివేసేలా చర్యలు తీసుకున్నారు. మొబైల్ పెట్రోలింగ్ బృందాలు నిరంతరం గస్తీ నిర్వహిస్తూ, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూస్తున్నాయి. పరీక్షలు ముగిసిన అనంతరం ప్రశ్నపత్రాలు మరియు సమాధాన పత్రాల తరలింపునకు పటిష్టమైన ఎస్కార్ట్ సౌకర్యాన్ని కల్పించారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిరోజూ పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తున్నారని, విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని పోలీస్ అధికారులు తెలిపారు.