పెద్ద కాపర్తి శివారులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు,
65వ నెంబర్ జాతీయ రహదారిపై తృటిలో తప్పిన ప్రాణనష్టం
నల్లగొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో శనివారం తెల్లవారుజామున ఒక భారీ బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి, బస్సు పూర్తిగా దహనమైంది. ప్రయాణికులందరూ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో తృటిలో పెద్ద ప్రాణనష్టం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. రెయిన్బో ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ లగ్జరీ బస్సు శుక్రవారం రాత్రి హైదరాబాద్లో ప్రయాణికులతో కాకినాడకు బయలుదేరింది. శనివారం తెల్లవారుజామున సుమారు 2:00 గంటల ప్రాంతంలో ఈ బస్సు నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులోకి చేరుకుంది. ఆ సమయంలో బస్సు ఇంజన్ నుండి ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు చెలరేగాయి.
డ్రైవర్, క్లీనర్ సమయస్ఫూర్తి
ఇంజన్లో మంటలను గమనించిన బస్సు డ్రైవర్, క్లీనర్ వెంటనే అప్రమత్తమయ్యారు. వారు క్షణాల వ్యవధిలో బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి, బస్సులో ప్రయాణికులను త్వరితగతిన కిందకు దించేశారు. ప్రయాణికులు కిందకు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తం వేగంగా వ్యాపించాయి. చూస్తుండగానే బస్సు పూర్తిగా అగ్నికీలల్లో చిక్కుకుపోయింది.ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం ప్రాథమిక సమాచారం. మంటలు క్షణాల్లో వ్యాపించడంతో బస్సు డిక్కీలో మరియు లోపల ఉన్న ప్రయాణికుల లగేజీ, విలువైన సామాన్లు, బ్యాగులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.