తెలంగాణ ఎక్సైజ్ శాఖకు ఏసీబీ నోటీసులు.. బ్యాంకు ఖాతాలు, పాన్ వివరాలు కోరింపు
తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖలో అవినీతి వ్యవహారాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దృష్టి సారించింది. ఇటీవల నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి నివాసాలు, కార్యాలయాలపై నిర్వహించిన దాడుల్లో కీలక సమాచారం లభించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల బ్యాంకు ఖాతా వివరాలు, పాన్ నంబర్లు, ఇతర ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని అందించాలని ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఇందుకోసం ప్రత్యేక ప్రొఫార్మా రూపొందించి, నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులకు వివరాలు సమర్పించాలని కోరినట్లు తెలిసింది.
దాడుల్లో లభించిన సమాచారంతో అక్రమ వసూళ్లు, నెలవారీ మామూళ్ల వ్యవహారాలపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ఏసీబీ సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ అంశాలపై అధికారికంగా ఏసీబీ ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. ప్రస్తుతం సంబంధిత సమాచారం సేకరణ, ప్రాథమిక పరిశీలన కొనసాగుతోంది.