ముఖం చాటేసిన రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ మండుతున్న ఎండలు
చైనాలో ఏర్పడిన "బావి" తుఫాన్ ప్రభావంతో రుతుపవన గాలుల దిశ మారినట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతో తేమగాలులు భారత్ వైపు వచ్చే ప్రవాహం తగ్గి, బంగాళాఖాతంలో అల్పపీడనాల ఏర్పాటుకు తాత్కాలికంగా ఆటంకం ఏర్పడినట్లు అంచనా.
ఈ నెల 16 లేదా 17 తేదీల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అది ఏర్పడితే వర్షాల పరిస్థితిలో మార్పు రావచ్చని సూచిస్తున్నారు.
ఏపీలో వర్షాభావం కారణంగా పలుచోట్ల ఎండలు మళ్లీ తీవ్రంగా మారాయి. తిరుపతిలో 41 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తా జిల్లాల్లో ఎండలతో పాటు వడగాడ్పులు కూడా ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 25 శాతం వర్షపాతం లోటు నమోదైంది. మరో రెండు నుంచి మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ అధికారులు తెలిపారు.
తెలంగాణలో కూడా పొడి వాతావరణం కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. మరికొన్ని జిల్లాల్లో 37 నుంచి 39 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జులై 15 వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉండగా, జులై 19 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
ప్రస్తుతం రుతుపవన ద్రోణి శ్రీగంగానగర్–హిస్సార్–మీరట్–గోరఖ్పూర్ మీదుగా దక్షిణ అస్సాం వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు అక్కడక్కడా చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో గంటకు 40–50 కి.మీ., తెలంగాణలో 30–40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.