పెద్దమ్మ తల్లి పట్నాలలో పాల్గొన్న మంత్రి అడ్లూరి..
పెద్దమ్మ తల్లి పట్నాలలో పాల్గొన్న మంత్రి అడ్లూరి.. ఆలయ మండప నిర్మాణానికి రూ. 15 లక్షలు మంజూరు!
ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించిన పెద్దమ్మ తల్లి పట్నాల కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి గ్రామస్తులు, భక్తులు డప్పు చప్పులతో, మంగళ వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు:
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులతో కలిసి పట్నాల వేడుకలో పాలుపంచుకున్నారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.
రూ. 15 లక్షల నిధుల ప్రకటన:
ఆలయ అభివృద్ధిపై గ్రామస్తులు విన్నవించగా, సానుకూలంగా స్పందించిన మంత్రి.. పెద్దమ్మ తల్లి ఆలయ మండప నిర్మాణానికి రూ. 15 లక్షలు మంజూరు చేస్తున్నట్లు అక్కడికక్కడే ప్రకటించారు. నిధుల కేటాయింపు పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.