పెంచిన పెట్రోల్ డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలి: సిపిఐ ఏలూరు ఏరియా సమితి
పెంచిన పెట్రోల్ డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలి: సిపిఐ ఏలూరు ఏరియా సమితి
ఏలూరు: భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ పవర్ పేట రైల్వే స్టేషన్ నుండి ఆర్.ఆర్.పేట పార్క్ వరకు ర్యాలీ నిర్వహించబడింది. కార్యక్రమంలో కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది.
సిపిఐ ఏలూరు జిల్లా సమితి కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ, 2014 ఎన్నికల సమయంలో బిజెపి ప్రభుత్వం ప్రజలకు తగ్గింపు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి, పెట్రోల్, డీజిల్ ధరలపై నిరంతర భారాన్ని మోపుతున్నారని విమర్శించారు. పశ్చిమాసియా దేశాల యుద్ధం నేపథ్యంలో కేవలం 10 రోజులలోనే నాలుగు సార్లు ధరలను పెంచడం వలన సామాన్య ప్రజలు తీవ్ర సమస్యల్లో ఉన్నారని పేర్కొన్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ బిజెపి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించలేదని, ఇతర సందర్భాల్లో చిన్న పెరుగుదలకే ధరలను విపరీతంగా పెంచడం జరుగుతున్నదని పేర్కొన్నారు.
సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్, పశ్చిమాసియా యుద్ధం ప్రారంభం అయిన వెంటనే దేశంలో ఆయిల్ సంక్షోభం ఏర్పడుతుందని బిజెపి ప్రభుత్వాన్ని హెచ్చరించినప్పటికీ, కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఆయిల్ రిఫైనరీ కంపెనీలకు కేంద్రం సహకరించడం, పెట్రోల్-డీజిల్-గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడం ప్రజలపై భారాన్ని మరింత పెంచిందని తెలిపారు.
ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు, బడుగు, బలహీన వర్గాలపై అధిక ధరల భారాన్ని కేంద్ర బిజెపి ప్రభుత్వం మోపుతున్నదని, ప్రజలు ఈనెల 1 నుండి 9 వరకు జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సిపిఐ ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శి కురెళ్ళ వరప్రసాద్, కార్యవర్గ సభ్యులు గొర్లి స్వాతి, శాయన అభిలాష్ కుమార్, కొండేటి రాంబాబు, దాసిపల్లి ఎర్రయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు భజంత్రీ శ్రీనివాసరావు, ఉప్పులూరి లక్ష్మి, కంటపరెడ్డి భాస్కరరావు, నడిపూడి ప్రసాద్, డి ఈశ్వరరావు, జి దుర్గారావు, ఎస్ బాబుజి, పి నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.