పెండింగ్ రెవెన్యూ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలి
అధికారులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాలు
మందమర్రి, బెల్లంపల్లి రెవెన్యూ కార్యాలయాల తనిఖీ
కాసిపేట, తాండూరుల్లో సింగరేణి నూతన ఓపెన్ కాస్ట్ స్థలాల పరిశీలన
మంచిర్యాల / బెల్లంపల్లి:
జిల్లాలో ఓటరు జాబితా సవరణతో పాటు భూభారతి, సాదా బైనామా తదితర రెవెన్యూ సమస్యల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన మందమర్రి, బెల్లంపల్లి, కాసిపేట, తాండూరు మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. రెవెన్యూ కార్యాలయాలను తనిఖీ చేయడంతో పాటు సింగరేణి నూతన ప్రాజెక్టుల స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారంపై ఆరా..
కలెక్టర్ కుమార్ దీపక్ మొదట మందమర్రి, బెల్లంపల్లి మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ నిర్వహణను పరిశీలించారు. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి, సాదా బైనామా, మరియు రెవెన్యూ సదస్సులలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిష్కార తీరును ఆరా తీసి మందమర్రి తహసీల్దార్ సతీష్ కుమార్తో పాటు ఇతర అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. అనంతరం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి, సబ్ కలెక్టర్ మనోజ్ తో కలిసి రెవెన్యూ దరఖాస్తుల పురోగతిపై సమీక్షించారు. పెండింగ్ దరఖాస్తులను నిబంధనల ప్రకారం వేగంగా పరిష్కరించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సింగరేణి నూతన ఓపెన్ కాస్ట్ స్థలాల పరిశీలన..
కార్యాలయాల తనిఖీ అనంతరం కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు. బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, కాసిపేట తహసీల్దార్ సునీల్, సింగరేణి సంస్థ మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ తో కలిసి కాసిపేట ప్రాంతంలో సింగరేణి నూతన ఓపెన్ కాస్ట్ గని ఏర్పాటు కోసం ప్రతిపాదించిన స్థలాలను పరిశీలించారు. ఆ తర్వాత తాండూర్ తహసీల్దార్ జ్యోత్స్న, సింగరేణి గోలేటి ఏరియా జనరల్ మేనేజర్లతో కలిసి తాండూర్ ప్రాంతంలోనూ పలు స్థలాలను పరిశీలించి అధికారులతో చర్చించారు.
ఈ పర్యటనలో ఆయా మండలాల రెవెన్యూ శాఖ అధికారులు, సింగరేణి సంస్థ ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు