పెనుగొలను గ్రంథాలయంలో జాతీయ గణాంక దినోత్సవం ఘనంగా నిర్వహణ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను శాఖా గ్రంథాలయంలో సోమవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో జాతీయ గణాంక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆధునిక భారత గణాంక పితామహుడు ప్రశాంత చంద్ర మహలనోబిస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం నిర్వహించిన సభలో కాన్వెంట్ ప్రిన్సిపాల్ తోట నాగరాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 29న మహలనోబిస్ జయంతిని దేశవ్యాప్తంగా జాతీయ గణాంక దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రణాళికా సంఘం ఏర్పాటులో, రెండవ పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారని వివరించారు.
గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలో గణాంకాల ప్రాధాన్యం మరింత పెరిగిందని, సరైన గణాంకాలు లేకపోతే అభివృద్ధి కుంటుపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి చిరుమామిళ్ల వెంకటనారాయణ, హైస్కూల్ పూర్వ విద్యార్థి వనమా రామ్మూర్తి, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.