పెనుగొలను లో ఘనంగా మదర్ థెరిసా 116వ జయంతి వేడుకలు
పెనుగొలను లో ఘనంగా మదర్ థెరిసా 116వ జయంతి వేడుకలు
మానవ సేవే మాధవ సేవగా నిలిచిన మహనీయురాలు మదర్ థెరిసా: వక్తలు
పెనుగొలను, ఆగస్టు 26:
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో మానవతావాది మదర్ థెరిసా 116వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మదర్ థెరిసా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మదర్ థెరిసా పేదలు, అనాథలు, రోగులు, నిరుపేదల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మానవతా మూర్తి అని కొనియాడారు. 1910 ఆగస్టు 26న ప్రస్తుత ఉత్తర మాసిడోనియా దేశంలోని స్కోప్లే నగరంలో జన్మించిన ఆమె చిన్ననాటి నుంచే సేవా భావాన్ని అలవర్చుకున్నారని తెలిపారు.
తండ్రి మరణం అనంతరం చిన్న వయసులోనే ఆధ్యాత్మిక మార్గం వైపు ఆకర్షితురాలైన మదర్ థెరిసా 18 సంవత్సరాల వయసులో ఇంటిని విడిచి సిస్టర్ ఆఫ్ లోరెటో సంఘంలో చేరారని వివరించారు. అనంతరం ఐర్లాండ్ వెళ్లి ఆంగ్ల భాషను అభ్యసించి, 1929లో భారతదేశంలోని డార్జిలింగ్కు వచ్చారని పేర్కొన్నారు.
1931 మే 24న తొలి సన్యాస ప్రమాణం చేసిన ఆమె కలకత్తాలోని లోరెటో కాన్వెంట్ పాఠశాలలో దాదాపు 17 సంవత్సరాల పాటు ఉపాధ్యాయురాలిగా సేవలందించారని తెలిపారు. 1948లో భారత పౌరసత్వం స్వీకరించిన మదర్ థెరిసా 1950 అక్టోబర్ 7న కలకత్తాలో పేదలు, రోగుల సేవ కోసం "మిషనరీస్ ఆఫ్ ఛారిటీ" సంస్థను స్థాపించారని వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను విస్తరించిన మదర్ థెరిసా చివరి దశలో ఉన్నవారికి, అనాథలకు, నిరుపేదలకు అండగా నిలిచి మానవతకు ప్రతీకగా నిలిచారని అన్నారు. ఆమె సేవలకు గుర్తింపుగా 1979లో నోబెల్ శాంతి బహుమతి, 1980 జనవరి 25న భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న లభించాయని తెలిపారు.
అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు, సాయిబాబా యువజన కమిటీ అధ్యక్షులు వూటుకూరు యజ్ఞ కృష్ణ, బొంత వెంకట నారాయణ, పొనుగుపాటి కిట్టయ్య, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.