పెనుగొలనులో ఘనంగా కైకాల సత్యనారాయణ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా, గంపలగూడెం మండలం, పెనుగొలను: శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం నిర్వహించిన సభలో విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి మాట్లాడుతూ, కైకాల సత్యనారాయణ ఆరు దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రయాణంలో సుమారు 777 చిత్రాల్లో హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విభిన్న పాత్రలు పోషించి తెలుగు సినీ పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. సినీ నటుడిగానే కాకుండా సినీ నిర్మాత, రంగస్థల నటుడు, పార్లమెంట్ సభ్యుడిగా కూడా విశేష సేవలందించారని తెలిపారు.
సినీ రంగంలో ఆయన ప్రతిభకు గుర్తింపుగా జీవితకాల సాఫల్య పురస్కారం, నంది అవార్డుతో పాటు అనేక పురస్కారాలు, సన్మానాలు అందుకున్నారని వివరించారు.
జయంతి సందర్భంగా శిరిడి సాయిబాబా సేవా కమిటీ సభ్యులు పెనుగొలను బోటిమీద ఉన్న 102 కోడ్ అంగన్వాడీ కేంద్రానికి చెందిన 10 మంది చిన్నారులకు టవల్స్, మిఠాయిలను పంపిణీ చేసి తమ సేవా భావాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, సాయిబాబా సేవా కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.