పెనుగొలనులో ఘనంగా నందమూరి హరికృష్ణ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం సినీ నటుడు, నిర్మాత, మాజీ పార్లమెంట్ సభ్యుడు నందమూరి హరికృష్ణ 70వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ నందమూరి హరికృష్ణ సినీ నటుడిగా, నిర్మాతగా, హిందూపురం శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా ప్రజా సేవలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. నందమూరి తారక రామారావు రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో హరికృష్ణ చైతన్య రథానికి సారథిగా వ్యవహరించి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి లక్షలాది కిలోమీటర్లు ప్రయాణించారని తెలిపారు. పార్టీ అభివృద్ధికి, ప్రజా సేవకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి చిరుమామిళ్ల వెంకటనారాయణ, గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వర్లు, సహకార సంఘం మాజీ అధ్యక్షుడు తన్నీరు వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దేవర రాములు, తోట సత్యం, నాటక కళాకారుడు రాళ్లచర్ల జగన్నాథం, కాన్వెంట్ ప్రిన్సిపాల్ తోట నాగరాజు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.