పెనుగొలనులో ఘనంగా శంకర్ దయాళ్ శర్మ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో మాజీ రాష్ట్రపతి, స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ 108వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శంకర్ దయాళ్ శర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడిగా, రాష్ట్రపతిగా, ఉపరాష్ట్రపతిగా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, పలు రాష్ట్రాలకు గవర్నర్గా, న్యాయశాస్త్ర ఆచార్యుడిగా, కవిగా, రచయితగా శంకర్ దయాళ్ శర్మ విశిష్ట సేవలు అందించారని కొనియాడారు.
1918 ఆగస్టు 19న జన్మించిన శంకర్ దయాళ్ శర్మ 1999 డిసెంబర్ 26న కన్నుమూశారని తెలిపారు. దేశం పట్ల ఆయనకున్న అంకితభావం, భారత రాజ్యాంగంపై ఉన్న లోతైన అవగాహన నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి, అంగన్వాడీ టీచర్ కే. లింగమ్మ, అంగన్వాడీ సిబ్బంది దేవర అంజలి, మహిళా కమిటీ సభ్యులు, గ్రామస్తులు, అంగన్వాడీ చిన్నారులు పాల్గొన్నారు.