పెనుగొలనులో రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి ఘనంగా నిర్వహణ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో శుక్రవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో సంఘసంస్కర్త, రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సాహు మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ, కొల్లాపూర్ సంస్థాన మహారాజుగా (1900–1922) సాహు మహారాజ్ ప్రజాహిత పాలన అందించారని తెలిపారు.
1902 జూలై 26న ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసి సామాజిక న్యాయానికి బాటలు వేసిన మహోన్నత సంస్కర్తగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. ఉచిత, నిర్బంధ విద్య, అంటరానితనం నిర్మూలన, వ్యవసాయ సంస్కరణలు, మహిళా సాధికారత, పటేల్–పట్వారీ వ్యవస్థ రద్దు వంటి అనేక సంస్కరణలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు.
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సామాజిక న్యాయం కోసం ప్రారంభించిన "మూక్ నాయక్" పత్రికకు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా, 1920లో అంబేడ్కర్ ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇంగ్లాండ్ వెళ్లేందుకు కూడా చేయూతనిచ్చిన గొప్ప మానవతావాది ఛత్రపతి సాహు మహారాజ్ అని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యార్థులు, సేవా కమిటీ సభ్యులు పాల్గొని సాహు మహారాజ్ సేవలను స్మరించుకున్నారు.