పెనుగొలనులో తిలక్, చంద్రశేఖర్ ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
పెనుగొలనులో తిలక్, చంద్రశేఖర్ ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
పెనుగొలను: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని 99వ అంగన్వాడి కేంద్రంలో గురువారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు బాల గంగాధర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఉపాధ్యాయురాలు కె. లింగమ్మ మాట్లాడుతూ, బాల గంగాధర్ తిలక్ 1856 జూలై 23న మహారాష్ట్రలోని రత్నగిరిలో జన్మించారని తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమంలో "స్వరాజ్యం నా జన్మహక్కు" అనే నినాదంతో ప్రజల్లో జాతీయ చైతన్యం కలిగించారని పేర్కొన్నారు. హిందువుల్లో ఐక్యత పెంపొందించేందుకు గణేష్ ఉత్సవాలు, ఛత్రపతి శివాజీ జయంతిని బహిరంగ వేడుకలుగా నిర్వహించే సంప్రదాయానికి శ్రీకారం చుట్టారని వివరించారు.
శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆర్గనైజర్ రంగు సత్యనారాయణ మాట్లాడుతూ, చంద్రశేఖర్ ఆజాద్ 1906 జూలై 23న మధ్యప్రదేశ్లోని బాబ్రా గ్రామంలో జన్మించారని తెలిపారు. 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని అరెస్టైన ఆజాద్, న్యాయస్థానంలో తన పేరు "ఆజాద్", తండ్రి పేరు "స్వతంత్రత", నివాసం "జైలు" అని ధైర్యంగా చెప్పి దేశభక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారని కొనియాడారు. బ్రిటిష్ పోలీసులకు ప్రాణాలతో చిక్కకూడదనే సంకల్పంతో తనను తానే కాల్చుకుని దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడని వివరించారు.
అనంతరం శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు 16 మంది అంగన్వాడి చిన్నారులకు పాదాల రక్షణ కోసం స్లిప్పర్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడి సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.