పెట్రోల్ , డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై ఆందోళనకు పిలుపు
ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో సిపిఐ ఎం.ఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును తీవ్రంగా ఖండించారు. పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు.
పశ్చిమాసియా యుద్ధాన్ని సాకుగా చూపిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతోందని హరినాథ్ విమర్శించారు. పెట్రోల్పై లీటరుకు రూ.3.30, డీజిల్పై రూ.3.14, గ్యాస్పై కేజీకి రూ.7 చొప్పున పెంచారని పేర్కొన్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల అనంతరం ధరలు పెంచి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఈ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉందన్నారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్పై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అమెరికా ఒత్తిడికి లోనై రష్యా, ఇరాన్ దేశాల నుంచి చమురు దిగుమతులను తగ్గించడం వల్లే దేశ ప్రజలపై ఆర్థిక భారం పడుతోందని విమర్శించారు.
మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పార్టీలకు అతీతంగా ఉద్యమించాలని హరినాథ్ పిలుపునిచ్చారు. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా సిపిఐ ఎం.ఎల్ లిబరేషన్, వామపక్షాలు, ప్రజాస్వామ్య శక్తులతో కలిసి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.