పిఎసిఎస్లో అక్రమ సభ్యత్వాల రద్దు ఆపాలి
పిఎసిఎస్లో అక్రమ సభ్యత్వాల రద్దు ఆపాలి – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినతి
ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలంలోని రెడ్డిగూడెం పిఎసిఎస్లో సభ్యత్వాలను అక్రమంగా తొలగిస్తున్నారని ఆరోపిస్తూ, వాటిని వెంటనే నిలిపివేయాలని కోరుతూ సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
రెడ్డిగూడెం తహసీల్దార్ జె. సుశీలా దేవికి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ ఫిర్యాదు అందజేశారు. రాజకీయ కుట్రలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రైతుల ఓట్లను లక్ష్యంగా చేసుకుని సభ్యత్వాలను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని, సంబంధిత అక్రమాలను అరికట్టి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి, వైస్ ఎంపీపీ చాట్ల రాబర్ట్, ఎన్టీఆర్ జిల్లా ఐటీ వింగ్ జనరల్ సెక్రటరీ గుడిసె ప్రభాకర రెడ్డి, మాజీ ఎంపీపీ మైలమాల కాంతారావు తదితరులు పాల్గొన్నారు.