పోలవరం గ్రామంలో గాంధీ విగ్రహం ధ్వంసం… ఉద్రిక్తతకు దారితీసే పరిణామాలు
పోలవరం గ్రామంలో గాంధీ విగ్రహం ధ్వంసం… ఉద్రిక్తతకు దారితీసే పరిస్థితులు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపింది. విగ్రహానికి కాళ్లు విరగగొట్టి అవమానకరంగా వ్యవహరించడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే గ్రామంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
కొంతకాలంగా అదే ప్రదేశంలో గాంధీ విగ్రహాన్ని తొలగించి బొడ్డురాయి ప్రతిష్టించాలని ఒక వర్గం ప్రయత్నాలు చేయగా, మరొక వర్గం దీనికి వ్యతిరేకంగా నిలిచింది. ఇటీవల ఈ విషయంపై గ్రామంలో వివాదం చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం అనుమానాలకు తావిస్తోంది.
పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. పరిస్థితి అదుపులో ఉండేలా భద్రతా చర్యలు చేపట్టారు.