చాట్రాయి మండల ఖాతాలో మరో IIIT, మొత్తం ఐదు, న భూతో న భవిష్యత్
పోలవరం విద్యార్థికి IIIT ఒంగోలులో సీటు
మండల విద్యాశాఖాధికారి, ప్రధానోపాధ్యాయుల అభినందనలు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల పరిధిలోని పోలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్ఎస్)కు చెందిన విద్యార్థి ఉండి నాగ మౌనేష్ ప్రతిష్టాత్మకమైన ఐఐఐటీ ఒంగోలు క్యాంపస్లో సీటు సాధించి గ్రామానికి, పాఠశాలకు గర్వకారణంగా నిలిచాడు.
ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో నాగ మౌనేష్ 571 మార్కులు సాధించి తన ప్రతిభను చాటుకున్నాడు. విద్యార్థి తండ్రి ఉండి వీర వెంకట నాగ మారీశ్వర రాజు వ్యవసాయంతో పాటు ఇతర వృత్తులు నిర్వహిస్తూ కుమారుడిని ఉన్నత విద్యాభ్యాసం వైపు ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా చాట్రాయి మండల విద్యాశాఖాధికారి-1 మాసగిరి శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాణి మేకల శ్రీనివాసరావు విద్యార్థి నాగ మౌనేష్తో పాటు అతని తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు.
మండల విద్యాశాఖాధికారి మాసగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు సరైన లక్ష్యంతో కృషి చేస్తే కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా అద్భుత ఫలితాలు సాధించవచ్చని మౌనేష్ నిరూపించాడన్నారు. ఐఐఐటీలో సీటు సాధించడం ద్వారా గ్రామానికి, మండలానికి మంచి పేరు తీసుకొచ్చాడని హర్షం వ్యక్తం చేశారు.
ప్రధానోపాధ్యాయులు రాణి మేకల శ్రీనివాసరావు మాట్లాడుతూ, నాగ మౌనేష్ మొదటి నుంచే చదువులో ప్రతిభావంతుడని, క్రమశిక్షణతో చదివి ఈ ఘనత సాధించడం పాఠశాల సిబ్బందికి గర్వకారణమని తెలిపారు. విద్యార్థికి మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయ బృందాన్ని కూడా ఆయన అభినందించారు.
భవిష్యత్తులో నాగ మౌనేష్ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి కుటుంబానికి, పాఠశాలకు, సమాజానికి మరింత పేరు తీసుకురావాలని ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఆకాంక్షించారు.