పోలవరంలో ఘనంగా మేరీ మాత (నిత్య సహాయ మాత) చర్చి 28వ వార్షికోత్సవ వేడుకలు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామం, పోలవరం పడమర హరిజనవాడలోని మేరీ మాత (నిత్య సహాయ మాత) చర్చి 28వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘస్తులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వేడుకల్లో భాగంగా మేరీ మాత విగ్రహాన్ని పురవీధుల్లో ప్రత్యేకంగా అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. భక్తులు ప్రార్థనలు, కీర్తనల మధ్య మేరీ మాతకు ఘన స్వాగతం పలికి తమ భక్తిని చాటుకున్నారు.
ఈ సందర్భంగా చర్చి ఫాదర్ పోలిశెట్టి జయరాజు మాట్లాడుతూ, మేరీ మాత ప్రేమ, కరుణ, సేవాభావానికి ప్రతీక అని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రేమ, శాంతి, సోదరభావంతో జీవిస్తూ దేవుని బోధనలను ఆచరించాలని సూచించారు. సమాజంలో మానవత్వం, పరస్పర సహకారం, దైవభక్తి పెంపొందించేందుకు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. నిత్య సహాయ మాత ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో చర్చి ఉపదేశి కొమ్ము విజయ్, గ్రామ పెద్దలు రామస్వామి, సుబ్బారావు, రామకృష్ణ, చార్లెస్, రాంబాబు, పరస వెంకటేశ్వరావు, నాగరాజు, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.