పోతనపల్లి చిన్న తండా, కోటపాడు గ్రామాల్లో ఎక్సైజ్ దాడులు
నవోదయం 2.0లో భాగంగా నాటు సారాపై ఎక్సైజ్ దాడులు.. ముగ్గురిపై కేసులు
నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారా నిర్మూలనకు చేపట్టిన "నవోదయం 2.0" కార్యక్రమంలో భాగంగా అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఏలూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ బి. శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ కే. నాగ ప్రభు కుమార్, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎ. అవులయ్య ఆదేశాల మేరకు చాట్రాయి మండలం పోతనపల్లి చిన్నతండా గ్రామంలో దాడులు చేపట్టారు.
దాడుల్లో దధారావతు రాములు వద్ద నుంచి 5 లీటర్ల నాటు సారా, ఒక హీరో గ్లామర్ మోటార్సైకిల్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం చాట్రాయి మండలం కోటపాడు గ్రామానికి చెందిన మోటపోతుల వెంకట రాజేశ్వరి వద్ద నుంచి 2 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు నాటు సారా సరఫరా చేస్తున్న పోతనపల్లి చిన్నతండాకు చెందిన ధారావతు రాంబాబు అలియాస్ రాముపై కూడా కేసు నమోదు చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ. మస్తానయ్య తెలిపారు.
అలాగే నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాల్లో బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాటు సారా తయారీ, విక్రయం, నిల్వలతో పాటు తయారీకి ఉపయోగించే బెల్లం సరఫరా చేసే వ్యాపారులు, బెల్లపు ఊటలను కలిగి ఉన్న భూ యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు.
నాటు సారా, బెల్ట్ షాపుల సమాచారాన్ని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఫోన్ నంబర్ 9440902462కు అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ. మస్తానయ్య తెలిపారు.