ప్రేమించిన యువతి మోసం చేసిందనే మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
హైదరాబాద్లో విషాద ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్లుగా ప్రేమించి ఇంట్లో తెలియకుండా వివాహం చేసుకున్న యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొహెడ గ్రామానికి చెందిన పల్లపు గోవర్ధన్, సరిత అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఓ బిడ్డ కూడా పుట్టింది. అయితే ఇటీవల ఆ బిడ్డను అమ్మేసి, మరో వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సరిత సిద్ధమైనట్లు సమాచారం.
ఈ విషయం తెలుసుకున్న గోవర్ధన్ పలుమార్లు ఆమెను తనతో రావాలని వేడుకున్నప్పటికీ సరిత నిరాకరించిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆమె పెళ్లి ఏర్పాట్లలో కూడా గోవర్ధన్ను ఉపయోగించుకున్నట్లు సమాచారం. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గోవర్ధన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మంగళవారం రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన గోవర్ధన్, బుధవారం ఉదయం నుంచి గదిలోనే ఉండిపోయాడు. సాయంత్రం వరకు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సోదరి తలుపులు పగలగొట్టి చూడగా, గోవర్ధన్ ఉరివేసుకుని మృతిచెందిన స్థితిలో కనిపించాడు.
తన ఆత్మహత్యకు కారణమైన యువతిని వదిలిపెట్టొద్దంటూ గోవర్ధన్ ఫోన్లో వీడియో రికార్డ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
గోవర్ధన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా అమ్మేసినట్లు చెబుతున్న చిన్నారి ఆచూకీ ఇంకా తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు.