ప్రభుత్వ భూమి కబ్జా...? ఆక్రమణల ఆరోపణలు
ప్రభుత్వ భూమి కబ్జా..? కోట్ల విలువైన సర్వే నం.99పై ఆక్రమణల ఆరోపణలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండల కేంద్రంలో ప్రభుత్వ భూమి ఆక్రమణలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పుట్రేల రోడ్డు–లైన్స్ క్లబ్ రోడ్డులో ఉన్న సర్వే నెంబర్ 99 భూమిలో అనధికార నిర్మాణాలు జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
గతంలో ఈ భూమిపై అధికారులు సర్వే నిర్వహించి, ఇది ప్రభుత్వ భూమి అని నిర్ధారించినట్లు సమాచారం. కోర్టు కమిషన్ ద్వారా కూడా సర్వే జరిపి ప్రభుత్వానికి చెందినదేనని తేల్చినట్లు చెబుతున్నారు. అప్పట్లో అక్కడ “ప్రభుత్వ భూమి” అని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
అయితే ప్రస్తుతం అదే భూమిలో పక్కా గృహాలు నిర్మించడం, ఖాళీ స్థలాలకు తీగలు వేయడం జరుగుతుండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో సెంటుకు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ధర ఉండటంతో ఈ భూమి విలువ కోట్లలో ఉంటుందని అంచనా.
ఇంత కీలకమైన భూమిపై ఆక్రమణలు జరుగుతున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. గతంలో బోర్డులు ఏర్పాటు చేసిన అధికారులు ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
స్థానికులు వెంటనే పూర్తి స్థాయి సర్వే నిర్వహించి, ఆక్రమణలను తొలగించాలని, ప్రభుత్వ భూమిని రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.