ప్రభుత్వ పాఠశాలల విద్యను ప్రభుత్వం గాలికి వదిలేసింది : ఏబీవీపీ
తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అఖిలభారత విద్యార్థి పరిషత్ నల్గొండ జిల్లా కన్వీనర్ కొంపల్లి సూర్య మండిపడ్డారు. నల్గొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజుల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ, బుక్స్, యూనిఫాంలు, బస్సుల పేరిట లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు. కనీసం ఫిట్నెస్ లేని బస్సులను నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, వసతి గృహాలు అరకొర వసతులతో నరకకూపాల్లా మారాయని విమర్శించారు. మరో రెండు వారాల్లో పాఠశాలలు ప్రారంభం కానున్నప్పటికీ, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించే ఊసే లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలని, ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపరిచి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏబీవీపీ నాయకులు శంకర్, జయేందర్, లక్ష్మి నివాస్, సిద్దు తదితరులు పాల్గొన్నారు.