పరీక్ష రాయనివ్వండి సార్.. కలెక్టరేట్లో ఏడో తరగతి విద్యార్థిని కన్నీటి పర్యంతం
పరీక్ష రాయనివ్వండి సార్.. కలెక్టరేట్లో ఏడో తరగతి విద్యార్థిని కన్నీటి పర్యంతం!
జగిత్యాల, మార్చి 30: చదువుకోవాలనే తపన ఉన్నా.. పేదరికం, కుటుంబ పరిస్థితులు ఆ చిన్నారిని చదువుకు దూరం చేస్తున్నాయి. ఇంటి బాధ్యత భుజాన పడటంతో బడికి వెళ్లలేకపోయింది.. ఇప్పుడు తీరా పరీక్షలు దగ్గరపడుతున్న వేళ, చదువు కోల్పోతాననే భయంతో ఆ బాలిక నేరుగా కలెక్టరేట్ మెట్లెక్కింది. జగిత్యాల కలెక్టరేట్లో నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమంలో చోటుచేసుకున్న ఈ ఘటన అందరినీ కలచివేసింది.
వివరాల్లోకి వెళ్తే..
గ్రీష్మ అనే విద్యార్థిని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. అమ్మ అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఇంటి బాధ్యతలన్నీ ఈ చిన్నారిపైనే పడ్డాయి. దీంతో గత కొంతకాలంగా గ్రీష్మ పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరు కాలేకపోయింది. ఈ క్రమంలో పాత పాఠశాల నుండి ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (TC) ఆలస్యంగా రావడం వల్ల, మరో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి అడ్మిషన్ ఇచ్చేందుకు నిరాకరించింది.
కలెక్టర్ వేడుకున్న గ్రీష్మ
పరీక్షలు సమీపిస్తుండటంతో తన విద్యా సంవత్సరం ఎక్కడ వృధా అవుతుందోనని ఆందోళన చెందిన గ్రీష్మ, సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ను కలిసింది. "ఎలాగైనా నాకు పరీక్షలు రాసే అవకాశం ఇవ్వండి సార్" అంటూ అధికారుల ముందు కన్నీరు మున్నీరైంది. తన కుటుంబ ఆర్థిక ఇబ్బందులను, పాఠశాల అడ్మిషన్ సమస్యను వివరించింది.
వెంటనే స్పందించిన యంత్రాంగం
బాలిక ఆవేదనను విన్న కలెక్టర్ వెంటనే స్పందించారు. జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) రాముతో ఫోన్లో మాట్లాడి, గ్రీష్మ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఆ బాలిక చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని, పరీక్షలు రాసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
కలెక్టర్ సానుకూలంగా స్పందించడంతో గ్రీష్మ ముఖంలో చిరునవ్వు చిిందింది. అధికారుల చొరవను అక్కడికి వచ్చిన ప్రజలు అభినందించారు