ప్రజలకు చేరువగా 'స్మార్ట్' పోలీసింగ్..
ప్రజలకు చేరువగా స్మార్ట్ పోలీసింగ్..
అన్నమయ్య జిల్లా - మదనపల్లి
బెట్టింగ్, గంజాయి, పేకాట తదితర అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు..
మహిళల భద్రతకు పెద్దపీట.. డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా..
అన్నమయ్య జిల్లా నేర సమీక్షా సమావేశంలో పోలీసు అధికారులకు ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి దిశానిర్దేశం..
మదనపల్లె, జులై 29: అన్నమయ్య జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా, 'స్మార్ట్ పోలీసింగ్' ద్వారా ప్రజలకు మరింత సమర్థవంతంగా, వేగవంతంగా సేవలు అందించేందుకు పోలీసు యంత్రాంగం సమిష్టిగా కృషి చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం మదనపల్లెలోని జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో "జిల్లా నేర సమీక్షా సమావేశం" నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు..
ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని CEIR, ఈ-సాక్ష్య, CCTNS, ఈ-సమ్మన్స్, ఈ-ప్రాసిక్యూషన్ తదితర మాడ్యూల్స్ పై అధికారులు పూర్తి పట్టు సాధించాలి. పెండింగ్ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయడంతో పాటు 'ఈ-ఆఫీస్'ను ప్రతి ఒక్కరూ సమర్ధవంతంగా వినియోగించుకోవాలి.
క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ (పేకాట), కోడి పందేలకు పాల్పడే వారిపై అత్యంత కఠినంగా వ్యవహరించాలి. గంజాయి తదితర మత్తు పదార్థాల విక్రయాలు, బహిరంగ మద్యపానం అరికట్టేందుకు 'డ్రోన్ కెమెరాల' ద్వారా నిఘా ఉంచి ఆకస్మిక దాడులు నిర్వహించాలి. నేర ప్రవృత్తి మానుకోని రౌడీ షీటర్లు, పాత నేరస్తులు, ట్రబుల్ మాంగర్ల కదలికలపై నిరంతర ప్రత్యేక నిఘా ఉంచాలి.
మహిళలపై నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి. స్కూళ్లు, కాలేజీలలో 'మహిళా భద్రత' మరియు 'సోషల్ మీడియా వేధింపుల' పట్ల విద్యార్థినులకు విస్తృత అవగాహన కల్పించాలి.
పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల (PGRS) పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, నిర్ణీత వ్యవధిలో చట్టపరిధిలో వారి సమస్యలను పరిష్కరించాలి.
దొంగతనాలకు పాల్పడే వారి నేర చరిత్రను విశ్లేషించి, వివిధ ప్రాంతాలలో జరుగుతున్న నేరాలను మ్యాపింగ్ చేయడం ద్వారా ఆయా సున్నిత ప్రాంతాలలో గస్తీని ముమ్మరం చేయాలి.
ఏపీ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం.. షాపులు, లాడ్జీలు, హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, అపార్ట్ మెంట్లు, జనసమ్మర్ధ ప్రదేశాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా, వాటి పనితీరును తరచూ పర్యవేక్షించేలా నిర్వాహకులకు అవగాహన కల్పించాలి.
ప్రాణనష్టం నివారించేందుకు రోడ్డు ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించి నివారణా చర్యలు చేపట్టాలి. వాహనదారులు విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించేలా అవగాహన కల్పించాలి. మైనర్ల డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్ లాంటి ఉల్లంఘనలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టి సంబంధిత నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలి.
ప్రతి పోలీసు అధికారి విధిగా గ్రామాల సందర్శన చేయాలి. గ్రామ సభలు నిర్వహించడం ద్వారా ప్రజలతో మమేకమై వారి సమస్యలు క్షేత్రస్థాయిలోనే తెలుసుకుని పరిష్కరించాలి.
డయల్ 100/112 కాల్స్ వచ్చినప్పుడు పోలీసులు తక్షణం స్పందించి, బాధితులకు అండగా నిలిచి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎస్పీ గారు జిల్లాలో వివిధ కేసులలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులకు, పోలీసు సిబ్బందికి మరియు హోంగార్డ్స్ కు నగదు ప్రోత్సాహాలు, ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ ఎం. వెంకటాద్రి గారు, రాయచోటి డీఎస్పీ శ్రీ ఎం.ఆర్. కృష్ణమోహన్ గారు, మదనపల్లె డీఎస్పీ శ్రీ ఎం. బుచ్చిరాజు గారు, డిఎస్పీ ఎస్.చంద్రశేఖర్ జిల్లా లోని సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.