ఉప్పల్ రింగ్రోడ్డుపై రాకపోకలు పునరుద్ధరణ
పిల్లర్ల నిర్మాణ పనులు పూర్తికావడంతో ఇరువైపులా దారులు తెరుచుకున్నాయి
ఉప్పల్ | Ntoday News
ఉప్పల్ రింగ్రోడ్డులో ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ల నిర్మాణానికి సంబంధించిన గుంతల పనులు పూర్తికావడంతో శుక్రవారం ఇరువైపులా రాకపోకలు పునరుద్ధరించారు. దీంతో వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి.
ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో భాగంగా రింగ్రోడ్డు మధ్యలో నాలుగు పిల్లర్ల నిర్మాణం కోసం రహదారిపై రాకపోకలను నిలిపివేశారు. దీంతో రామంతపూర్, హబ్సిగూడ వైపు నుంచి ఉప్పల్, ఘట్కేసర్ మీదుగా వరంగల్ వైపు వెళ్లే వాహనాలను సర్వే ఆఫ్ ఇండియా ఎదురుగా ఉన్న సిగ్నల్ మీదుగా బీరప్పగడ్డ వైపు మళ్లించారు.
దాదాపు మూడు నెలలుగా ఉప్పల్–హన్మకొండ ప్రధాన రహదారిపై ఆంక్షలు, మళ్లింపులు కొనసాగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పిల్లర్ల నిర్మాణానికి సంబంధించిన కీలక పనులు పూర్తికావడంతో రాకపోకలను పునరుద్ధరించారు.
దీంతో ఉప్పల్ నుంచి వరంగల్, హన్మకొండ వైపు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కొంతమేర తగ్గనున్నాయి. రాకపోకలను పునరుద్ధరించడంతో స్థానికులు, వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ మొత్తం నిర్మాణాన్ని 2027 జూన్ నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.