గ్లోబల్ టీడీపీ ఉపాధ్యక్షుడిగా పుట్టగుంట సురేష్
గ్లోబల్ టీడీపీ ఉపాధ్యక్షుడిగా పుట్టగుంట సురేష్ మంగళగిరి: గ్లోబల్ ఎన్నారై టీడీపీ నూతన ఉపాధ్యక్షుడిగా పుట్టగుంట సురేష్ నియమితులయ్యారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఆధ్వర్యంలో బుధవారం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. గ్లోబల్ ఎన్నారై టీడీపీ అధ్యక్షుడిగా డాక్టర్ పిల్ గురురాజా, ఉపాధ్యక్షుడిగా పుట్టగుంట సురేష్తో పాటు మరో 45 మంది నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగుదేశం పార్టీ బలోపేతంలో గ్లోబల్ ఎన్నారైల పాత్ర ఎంతో కీలకంగా ఉందన్నారు. భవిష్యత్తులోనూ ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారందరినీ కలుపుకొని పార్టీ బలోపేతానికి, రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన గ్లోబల్ ఎన్నారై టీడీపీ కార్యవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించడం సంతోషకరమన్నారు. పుట్టగుంట సురేష్ తనకు ఎన్నో సంవత్సరాలుగా ఆత్మీయ మిత్రుడని, టీడీపీ విజయానికి ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు. సురేష్ సేవలను గుర్తించి గ్లోబల్ టీడీపీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సురేష్కు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. పుట్టగుంట సురేష్ మాట్లాడుతూ, తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఇతర టీడీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న తెలుగువారిని అనుసంధానం చేస్తూ, వారు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేలా గ్లోబల్ ఎన్నారై టీడీపీ కమిటీ పనిచేస్తుందని చెప్పారు. నూతన ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన పుట్టగుంట సురేష్, కార్యనిర్వాహక కార్యదర్శి ఫర్హాద్ షాలను యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్, పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిరు ప్రతాపరెడ్డి, చిత్తూరు జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు ధనుంజయ యాదవ్ తదితరులు పూలబొకేలు, శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.